మొన్న సాయంత్రం, నా బైక్ పై Z.P సెంటర్ వద్ద మలుపు తీసుకుంటుండగా, ఆవులు రోడ్డు కు అడ్డంగా నిలబడి ఉండడం గమనించి సడన్గా బ్రేకు వేయగా కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని అక్కడ ఉన్న మూడు ఆవుల్ని సముదాయించి పక్కకు వెళ్లేలా చేశా.. అలా ఐన వేరేవాళ్లకి ఏ ప్రమాదం ఉండకూడదు అని.. తిరిగి నా బైకు పై వెళ్తుండగా మల్లి ఇంద్రపాలెం బ్రిడ్జి దగ్గర అవే దృశ్యాలు. ఈ రెండు చోటలే కాదు, భానుగుడి సెంటర్, పద్మ ప్రియ, కోకిల, సినిమా రోడ్డు, APSP, మెయిన్ రోడ్, జగన్నాధపురం..
ఎక్కడ పడితే అక్కడే విచక్షణారహితంగా ఆవులని వాటి యజమానులు వదిలేయడంతో నగరం లో ట్రాఫిక్ మరియు అనేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ఇది చిన్న ఉదాహరణే.. నగరం లో ఈ పశువుల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో.. ఇలా ట్రాఫిక్ ప్రమాదాలే కాదు, పశువులు రోడ్లు మీదే మల మూత్ర విసర్జనలు చేయడంతో కొన్ని చోట్ల రోడ్లపై నడవడానికి కూడా వీలు లేకుండా అవుతున్నాది. వాటి యజమానుల నిర్లక్ష్యానికి, పాపం ఆకలికి ఆహారం కోసం రోడ్ మీద చెత్త డబ్బాలని చిందరవందరగా పడవేయడంతో ఆ చుట్టుపక్కల అంతా చెత్తతో నిండిపోతున్నాది.
ఈ పశువులు చాలావరకు ‘పట్టణ రైతులు’ కు చెందినవే, వారికి పశుగ్రాసం దొరకకో, లేక డబ్బులు ఆదా అవుతాయి అనే నిర్లక్ష్య కారణం చేతో తెలియదు కానీ వీళ్ళు ఇలా నగర వీధులమీద పశువులను వదిలిపెడుతున్నారు.
చట్టం ప్రకారం కాకినాడ నగర పరిమితుల్లో పశువులు ఇలా వదిలివేయడం అనుమతించబడవు. అట్లా చేసినచో ఆ యజమానులకు జరిమానా వసూలు చేయాలి, కానీ అసల నగర పాలక సంస్థ ఒక్కసారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే అదనుగా ఎవరు అడుగుతారులే అనే నిర్లక్ష్యం తో పశువుల యజమానులు ఎవరి ఇష్టానుసారం వారు ఇలా రోడ్ల పై వదిలేస్తున్నారు.
కుక్కలు, పందులు వలన ఎంత తీవ్ర ఇబ్బంది పడుతున్నామో ఈ పశువులతో కూడా అంతే ఇబ్బంది పడుతున్నాం. పందుల నిర్మూలన ఎలా ఐతే జరుగుతున్నదో దీనికి కూడా ఒక పరిష్కారం ఉండాలి.
బిజీగా ఉన్న రహదారులపై పశువులను వదిలివేయడం వల్ల వాహన ప్రమాదాలు చోటు చేస్కోడమే కాదు, పాపం ఆ మూగ జీవాలకి కూడా ప్రమాదకరమే. బహిరంగ ప్రదేశాల్లో పశువుల పెంపకం కోసం ఇలా పశువులు విడిచిపెట్టిన వారిపై కొన్ని కఠినమైన చట్టాల అమలు పర్చాలి. నిరాదరణకు గురైన పసువులను గోసంగాలకు తరలించాలి, ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన యజమానికి తీవ్రమైన శిక్ష విధించాలి.
కాకినాడ నగర పాలక సంస్థ మరియు ఇతర స్వచ్చంద సంస్థలు, పశువుల యజమానులనులకు అవగాహన కల్పించే చొరవ తీసుకుని పశువులను రోడ్లుపై వదిలివేయకుండా అవగాహన కల్పించాలి. ప్రజాప్రతినిధులు కూడా తగు పరిష్కారం కనుగొనాలి. నగరం లో ఏదో ఒక ఖాళి స్థలం గాని ప్రత్యేక గోశాల గాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
Comments